కేసీఆర్ కృషితోనే సీతారామ ప్రాజెక్టు నీళ్లు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం:
సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, నిరంతర కృషి ఫలితంగానే ప్రస్తుతం ఖమ్మం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 1600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నామంటే అది నాడు కేసీఆర్ ఆలోచించిన మహత్తర ప్రాజెక్టు కార్యరూపం దాల్చిన ఫలితమేనని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందడంతో రైతులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని, వ్యవసాయ రంగానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు కోసం సుమారు రూ.9 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్ హౌస్లు, పైప్లైన్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించామని వివరించారు. అధిక సామర్థ్యం కలిగిన మోటార్లు, ఆధునిక యాంత్రిక పరికరాలు, భారీ పంపింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, ఖమ్మం జిల్లా రైతుల భవిష్యత్తును మార్చే కీలకమైన ప్రాజెక్టు అని ఆయన అన్నారు. గతంలో వర్షాలపై ఆధారపడిన అనేక ప్రాంతాలకు ఇప్పుడు సాగునీటి భరోసా లభించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.


