సత్తుపల్లి,
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ )
ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న రూ.89 లక్షల విలువైన 166 కిలోల 360 గ్రాముల గంజాయిని సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడు ప్రబిన్ భాత్రాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ బృందం, పోలీసు సిబ్బంది శుక్రవారం సత్తుపల్లిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వస్తున్న కారును తనిఖీ చేయగా, డిక్కీలో ఆరు ప్లాస్టిక్ సంచుల్లో మొత్తం 80 గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి బరువు 166.360 కిలోలుగా తేలింది.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఒక కారు, సెల్ఫోన్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో, ఒడిశాకు చెందిన బికారి అలియాస్ రోహన్ అనే వ్యక్తి గంజాయిని హైదరాబాద్లో తాను చెప్పిన వ్యక్తికి అప్పగిస్తే రూ.10 వేల పారితోషికం ఇస్తానని చెప్పడంతో ప్రబిన్ భాత్రా ఈ అక్రమ రవాణాకు ఒప్పుకున్నట్లు వెల్లడైంది. దారకొండ జంక్షన్ నుంచి రాజమండ్రి మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా హైదరాబాద్కు వెళ్తుండగా సత్తుపల్లిలో పోలీసుల తనిఖీల్లో చిక్కాడు.
పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి సరఫరా నెట్వర్క్పై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



