ఖమ్మం, జూలై 1
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి నుంచి సుమారు రూ.94 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు సైబర్ నేరస్తులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితుడికి వాట్సాప్ ద్వారా పరిచయం అయిన నిందితులు డోలాట్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్ పేరుతో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. వాట్సాప్ లింకులు, ట్రేడింగ్ అప్లికేషన్ల ద్వారా బాధితుడితో సుమారు రూ.94 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డారు.
దర్యాప్తులో భాగంగా కేసుకు సంబంధించిన రూ.13 లక్షలు జమ అయిన బ్యాంకు ఖాతాల ఆధారంగా ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఆశీనా (35), నిసముద్దీన్ (42)లను అరెస్టు చేశారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై ఖమ్మంకు తీసుకువచ్చి సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని రిమాండ్కు పంపింది.
ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్.ఆర్.వి. ఫణీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకట కృష్ణారావు, నాగేంద్ర, కృష్ణప్రసాద్, స్వప్నతో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.



