మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రద్దు చేసిన పాఠశాల బస్సును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చుంచులూరు, పడమటి నాయుడుపల్లి పంచాయతీలకు చెందిన నందవరం మోడల్ స్కూల్ విద్యార్థులు బుధవారం మర్రిపాడు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. నందవరం మోడల్ స్కూల్కు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ బస్సును రద్దు చేయడంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో సమయానికి పాఠశాలకు చేరుకోలేకపోతున్నామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం విజయోత్సవ వేడుకల సందర్భంగా ఆత్మకూరుకు విచ్చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిను కలిసి తమ సమస్యను వివరించినట్లు విద్యార్థులు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చి, ప్రతిరోజూ పాఠశాలకు హాజరై బాగా చదువుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.అంతేకాకుండా పాఠశాల బస్సు పునరుద్ధరణకు సంబంధించి ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు.
అయితే మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ డిపో మేనేజర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టినట్లు వెల్లడించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల బస్సును వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులను కోరారు.ఈ నిరసనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


