✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా
అనపర్తి, జూన్ 20 ( పున్నమి న్యూస్ ): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా కొనసాగుతూ రికార్డు నెలకొల్పిన సందర్భంగా దూరదర్శన్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ వచ్చే ఆదివారం సాయంత్రం 6:10 గంటల నుంచి 7:00 గంటల వరకు ప్రసారం కానుంది.
ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4,399 రోజులు ఎన్నికైన ప్రధానిగా సేవలందిస్తూ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్యంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
గత 12 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఇండియా వంటి అనేక కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేరువైందని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 160 సంక్షేమ పథకాల ప్రయోజనాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం ప్రజాప్రతినిధులు మరియు అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా పీఎం జనధన్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చివరగా, ఎన్నికైన ప్రధానిగా 4,399 రోజుల సేవా మైలురాయిని అధిగమించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.




