ఖమ్మం, జూన్
(పున్నమి జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్):
ఖమ్మం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ గస్తి మరింత కట్టుదిట్టం చేయాలని ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ పోలీస్ అధికారులను కోరారు.
శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖమ్మం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పగలు, రాత్రి వేళల్లో నిరంతర పోలీస్ గస్తి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రెండు రోజుల క్రితం కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కళాశాల వద్ద ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేసి, ఆయన వద్ద ఉన్న నగదును దోచుకెళ్లిన ఘటన జరిగిందని తెలిపారు. దాడిలో గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ వెంటనే స్పందించి, నగరంలోని రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రత్యేక నిఘా, పగలు-రాత్రి గస్తీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ
సందర్భభముగా వెంకట నారాయణ కోరారు.



