పట్టణంలోని రంగనాయకులపేట వీధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు, విద్యార్థి నేత మల్లెం హేమంత్ కుమార్ బుధవారం వినూతన రీతిలో నిరసన చేపట్టారు. ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలను తొలగించేందుకు తవ్విన గుంతలోనే ఆయన దిగి నిలబడి అధికారుల తీరును ఎండగట్టారు.
-డబ్బులు మీవే.. గుంత మీదేనన్నారు:
స్థానికుల కథనం ప్రకారం.. రంగనాయకులపేట వీధిలో విద్యుత్ వైర్లు ఇళ్లపై పడుతుండటంతో ప్రమాదం పొంచి ఉందని, వెంటనే కరెంటు స్తంభాన్ని మార్చాలని స్థానికులు విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. అయితే, “మీ సొంత ఖర్చులతో మీరే గుంత తీయిస్తే.. మేము వచ్చి స్తంభం నాటుతాం” అని అధికారులు చెప్పడంతో, స్థానికులే చొరవ తీసుకుని గుంత తవ్వించారు.
-మురుగునీరు చేరి నరకప్రాయం:
గుంత తీసి ఐదు రోజులు గడుస్తున్నా విద్యుత్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో వీధిలోని డ్రైనేజీ మురుగునీరంతా వచ్చి ఆ కరెంటు గుంతలో చేరింది. ఆ నీరు కాస్తా రోడ్డుపైకి ప్రవహిస్తుండటంతో వీధంతా తీవ్ర దుర్వాసన వస్తోందని, నడవడానికి కూడా వీల్లేకుండా పోయిందని పాదచారులు, స్థానికులు మండిపడుతున్నారు.
-తక్షణమే సమస్యను పరిష్కరించాలి:
స్థానికుల అవస్థలను చూసి చలించిన టీడీపీ నేత హేమంత్ కుమార్.. మురుగునీరు చేరిన ఆ కరెంటు గుంతలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న విద్యుత్ సమస్యలపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి, ఇక్కడ నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు మురుగునీటి అవస్థల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు


