రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బార్ అసోసియేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీతతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సి.వి. ప్రసాద్ , కార్యదర్శి పి. రమేష్ , సీనియర్ న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా జడ్జి గంధం సునీత మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో ఆయన చూపిన దారిని నేటి తరాలు అనుసరించాలని సూచించారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చిన హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలు న్యాయవాదులకు మార్గదర్శకమని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. న్యాయ వ్యవస్థలో న్యాయం అందరికీ చేరేలా కృషి చేయడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ట్రైనీ లాయర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చివరగా స్వీట్లు పంచుకుని వేడుకలను ఆనందంగా ముగించారు.


