కోవిడ్ వేళ .. రోగులకు చికిత్స అందించేందుకు ప్రపంచ దేశాలు నానా అగచాట్లు పడుతున్నప్పుడు ఓ చిన్న దేశం ‘నేనున్నా’ అంటూ ముందుకు వచ్చింది. ఆంక్షలు, నిర్బంధాల మధ్య అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థతో కుదేలవుతున్నా కోవిడ్ మొదటి దశలో ప్రపంచంలోని ఇరవై దేశాలకు ఆ దేశం 26 వైద్య బృందాలను పంపింది. ఆ సమయంలో దాదాపు 30 వేల మంది రోగులకు చికిత్స అందించిన ఆ దేశం .. ప్రపంచానికి ఆశాకిరణంలా కనిపించిన ఆ దేశం.. ‘క్యూబా’.
వైద్య చరిత్రలో ఇంతటి ఘన చరిత్ర గల ఈ దేశంలో ప్రస్తుతం అమెరికా విధించిన ఆంక్షలతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది.ఈ అంతరాయం దేశాన్ని మాత్రమే అంధకారంలో నెట్టేయడం లేదు. ఆరోగ్య వ్వవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తోంది.
విద్యుత్ కోత వల్ల సకాలంలో వైద్యం అందక ఆస్పత్రుల్లో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు.నవజాత శిశు మరణాలు పెరిగాయి.డీజిల్,పెట్రోలు కొరతతో వైద్య సిబ్బంది సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేక పోతున్నారు. నైపుణ్యమైన వైద్యం అందించడంలో ప్రపంచానికే దిక్సూచిగా నిలబడిన క్యూబాలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఆ దేశానికే కాదు,ప్రపంచానికే పెద్ద ముప్పు. ప్రస్తుతం క్యూబా ఆస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై అక్కడి డాక్టర్లు ఎంతో ఆవేదన చెందుతున్నారు.
*విద్యుత్ లేదు.. వెంటిలేటర్ లేదు*..
క్యూబా రాజధాని హవానాలోని ఓ ఆస్పత్రిలో జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న 21 ఏళ్ల యువకుడు వైద్యం తీసుకుంటున్నాడు.ఊపిరి తీసుకోవడం కష్టమైన అతడికి చాలా రోజుల నుండి వెంటిలేటర్లపై వైద్యం చేస్తున్నారు.ఈ చికిత్స అతడు కోలుకోవడానికి చాలా కీలకం.కానీ ఇప్పుడు విద్యుత్ అంతరాయంతో వెంటిలేటరు సరిగ్గా పనిచేయడం లేదు. గంటల తరబడి విద్యుత్ కోతల వల్ల మిషన్ చార్జింగ్ అవ్వడం కూడా కష్టంగా ఉంటోంది.దీనిపై యువకుడి తల్లి ఇలా అంటోంది…: ‘ఈ పరిస్థితుల్లో నా కొడుకును ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదు. వాడి జీవితం విద్యుత్ పైనే ఆధారపడి ఉంది’.
ఇటీవల ఆరుగురు వైద్యుల బృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ‘ఇక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయంటే .. నివారించ గలిగే మరణాలు కూడా తరచూ సంభవిస్తున్నాయి.ఎన్ని మరణాలు సంభవించాయో చెప్పలేం కానీ,గతేడాదితో పోల్చితే కచ్చితంగా ఎక్కువే అని చెప్పగలం’ అని హవానాలోని అతిపెద్ద పిల్లల ఆస్పత్రి చీఫ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ అలియోత్ ఫెర్నాండెజ్ అన్నారు.
వైద్యులు,నర్సులు విధుల్లోకి హాజరు కాలేకపోవడం వల్ల ఆస్పత్రులు శస్త్రచికిత్సలు రద్దు చేసి రోగులను ఇంటికి పంపించేస్తున్నాయి.విద్యుత్ అంతరాయాల వల్ల కీమోథెరపీ,డయాలసిస్ వంటి చికిత్సలు అందించడానికి క్లినిక్లు ఇబ్బంది పడుతున్నాయి. గ్యాస్ దొరక్క చాలా అంబులెన్సులు నిలిచిపోయాయి. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. మందులు కొనడానికి కూడా వీలులేక ఫార్మసీలు మూతబడుతున్నాయి.
ఫ్యాక్టరీలు డీజిల్తో నడుస్తున్నందున మందుల ఉత్పత్తి చాలావరకు నిలిచిపోయింది.జెట్ ఇంధనం కొరత వల్ల విమానాలు రద్దు అయ్యాయి.ఈ కారణంగా వ్యాక్సిన్ తయారీదారులు ముడిపదార్థాల కోసం తలమునకలవు తున్నారు.విద్యుత్ కోతలు ఇలానే కొనసాగితే శీతలీకరించిన వ్యాక్సిన్ నిల్వలు త్వరలోనే పాడైపోయే అవకాశం ఉంది.
*నిపుణుల హెచ్చరిక*
‘ఇది సాధారణ విషయం కాదు. చాలా తీవ్రమైనది’ అని ఆప్ఘనిస్తాన్, ఉక్రెయిన్,గాజాలలో ప్రజారోగ్య సహాయక చర్యలకు నాయకత్వం వహించిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని ప్రజారోగ్య నిపుణుడు పాల్ స్పీగెల్ చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపుగా, క్యూబా ప్రభుత్వం తన బడ్జెట్లో ఐదవ వంతును ఆరోగ్యంపై ఖర్చు చేసేది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, కోవిడ్-19కు ముందు వరకు క్యూబాలో ఆయుర్దాయం, శిశు మరణాల రేట్లు అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉండేది. అదే సమయంలో వైద్యుడు- రోగి నిష్పత్తి ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండేది.
ట్రంప్ మొదటిసారి అమెరికా గద్దె ఎక్కినప్పటి నుండి క్యూబాపై ఆంక్షలు మరింత ముదిరాయి.ఆస్పత్రులు పాతబడిన పరికరాలను మార్చకుండా నిరోధించేంతగా ఆర్తిక వ్యవస్థ అతలాకుతలమైంది. అమెరికాపై ఉన్న భయం కారణంగా యూరోపియన్ వైద్య సరఫరదారులు ఒప్పందాలను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వానికి వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
*నవజాత మరణాలు అధికమయ్యాయి*
2018లో క్యూబాలో ప్రతి వెయ్యి జననాలకు శిశుమరణాల రేటు 4 ఉండేది.ఇది యునైటెడ్ స్టేట్స్ కంటే తక్కువ. 2025 నాటికి ఆ రేటు రెట్టింపు కంటే ఎక్కువై 10 మరణాలకు చేరింది.ఆంక్షల ప్రభావంపై ప్రజారోగ్యంపై అధ్యయనం చేసే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ వైద్యురాలు రూత్ గిబ్సన్ దీనిపై మాట్లాడారు. ‘ఆంక్షల ప్రభావం ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపడానికి చాలా కాలం పట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది’ అంటున్నారు.
క్యూబాలోని ప్రముఖ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసూతి-స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ లిలియం డెల్గాడో పెరుయెరా ‘ఇప్పటికే ఆ నష్టం స్పష్టంగా కనిపిస్తోంది’ అంటున్నారు. ‘ఆంక్షల కారణంగా ఆస్పత్రిలో యాంటీబయాటిక్స్, మందులు,పరికరాల కొరత ఏర్పడింది. ఆహార కొరత వల్ల గర్భిణీలు, నవజాత శిశువుల బరువు మరింత తగ్గిపోయింది. ఇంధన కొరత వల్ల వైద్యులు,నర్సులు, పారిశుధ్య కార్మికులు, గర్భిణీలు ఆస్పత్రికి సకాలంలో చేరుకోలేక పోతున్నారు. దీనివల్ల ప్రసూతి గదులు మురికిగా మారుతున్నాయి. ప్రమాదకర పరిస్థితికి వచ్చిన తరువాత ప్రసవం కోసం వస్తున్నారు’ అని ఆమె అంటున్నారు.
‘ఫిబ్రవరిలో ముగ్గురు నవజాత శిశువులు మరణించారని, ఒక నెలలో ఇంత ఎక్కువ మంది మరణించడం తన సర్వీసులో ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. ముఖ్యంగా ఇటీవలి వారాల్లో నెలలు నిండని జననాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని, యాంటీబయాటిక్స్ కొరత కారణంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల వల్ల ఈ రకమైన జననాలు పెరుగుతున్నయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*పిల్లలకు టీకాలు లేవు*
క్యూబన్ ప్రభుత్వం ఈ నెలలో చెప్పిన గణాంకాల ప్రకారం 96 వేల 400 మంది రోగులు శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్నారు.ఇంధన కొరత కారణంగా 30 వేల మందికి పైగా పిల్లలకు టీకాలు ఆలస్యమయ్యాయి. దాదాపు 20 వేల మంది రోగులకు రేడియేషన్ థెరపీ, కిడ్నీ డయాలసిస్ సక్రమంగా అందడం లేదు. మందుల కొరత తీవ్రంగా ఉండడం వల్ల ఫార్మసీలకు తాళం వేస్తున్నారు.
*దుర్భరంగా చికిత్సలు*
ఒక బాలుడికి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఎదురైన పరిస్థితిని చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఫెర్నాండెజ్ ఇలా గుర్తు చేసుకున్నారు.”రెండు నెలల బాలుడికి శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. జనరేటర్ పనిచేయడం మొదలుపెట్టేవరకు శిశువు ప్రాణ సంకేతాలను చూపించే మోనిటర్ కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్న మాకు ఆ సమయం కొన్ని గంటల్లాగా అనిపించింది. మరోచోట పిల్లల వార్డులో కరెంటు పోయినప్పుడు డాక్టర్లు, నర్సులు ఆ వైపు పరుగులు పెట్టారు.అక్కడ అనారోగ్యంతో ఉన్న శిశువులకు వెంటిలేటర్లపై వైద్యం చేస్తున్నారు. కరెంటు పోయి అవి ఆగిపోయాయి.వాటి బ్యాటరీ వ్యవస్థలు సంవత్సరాల క్రితమే పాడైపోయాయి. ఈ పరిస్థితుల్లో జనరేటర్లు పనిచేయడం మొదలుపెట్టేంత వరకు శిశువులు శ్వాస తీసుకునేలా ఆరోగ్య కార్యకర్తలు తమ చేతులతో రబ్బరు పంపును నొక్కారు”.
ఆరోగ్య సంరక్షణలో ప్రపంచానికి ఆదర్శం
కొత్త తల్లులకు,శిశువులకు క్రమం తప్పకుండా ఆహారం, సప్లిమెంట్లు,మందుల ప్యాకేజీలను అందించడం క్యూబన్ ఆరోగ్య సంరక్షణ వ్వవస్థ ముఖ్య లక్షణం. ఈ కారణంగానే కోవిడ్ ముందు వరకు ఈ ప్రాంతంలో పిల్లల పోషకాహార లోపం రేటు అత్యంత తక్కువగా వుండేదని యునిసెఫ్ తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హవానాలోని కమ్యూనిటీ డాక్టరుగా పనిచేస్తున్న డాక్టర్ రొక్సానా మార్టినెజ్ రోడ్రిగ్జ్ దీనిపై మాట్లాడారు.
‘తల్లులకు,పిల్లలకు సమకూర్చే మందులు,ఆహారం ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా లేదు.ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక జీతం అల్పాహారానికి కూడా సరిపోవడం లేదు. క్యాబేజీ కొనుక్కోవడం విలాసవంత విషయంగా మారిపోయింది.అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలు ఇప్పటివరకు మమ్మల్ని ప్రభావితం చేశాయి. ఇప్పుడు మీరు కోరుకున్నా, కోరుకోపోయినా అవి మీ వరకు వస్తాయి’ అని రోడ్రిగ్జ్ అంటున్నారు.


