తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి ఫిబ్రవరి 13 : ఈ నెల 15వ తేదీన జరగనున్న మహా శివరాత్రి సందర్భంగా గోదావరి స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. యువ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడిన వారు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మార్వో కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో వీరన్న, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
తాళ్లపూడి మండల పరిధిలోని ప్రతి రేవులో పోలీసు మరియు రెవెన్యూ శాఖ సిబ్బందికి షిఫ్ట్ డ్యూటీలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. Kovvur రూరల్ సీఐ విజయబాబు ఆధ్వర్యంలో ప్రతి స్నాన ఘాట్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం చోటుచేసుకున్న ప్రమాదం పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్సై టి. రామకృష్ణ స్పష్టం చేశారు.
వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గట్టు ప్రాంతాల్లో, ఆలయాల సమీపంలో ప్రసాదాలు స్వీకరించే భక్తులు వాహనాలను రహదారి పక్కన అడ్డంగా పార్క్ చేయకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి, శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో భక్తులు ఆనందంగా జరుపుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.




