జీవీఎంసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు – 2025
* ఉద్యోగులు అవినీతి రహితంగా , ప్రజాసేవా భావంతో విధులు నిర్వహించాలి.
• ఏసీబీ ఫోన్ నెంబర్ 1064 ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంది. ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలి.
ఎ సి బి డి ఎస్ పి – బి. వి. ఎస్. ఎస్. రమణమూర్తి .
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*; ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి రహితంగా ప్రజాసేవ భావంతో తమ విధులను నిర్వహించాలని అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. వి. ఎస్. ఎస్. రమణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 2025 విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సందర్భంగా “విజిలెన్స్ – మన ఉమ్మడి బాధ్యత ” అనే కార్యక్రమాన్ని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ కార్యదర్శి బి . వి.రమణ,డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు నాతో కలిసి జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులకు , సచివాలయ వార్డు కార్యదర్శులకు అవినీతి నిర్మూలనపై అవగాహనను కల్పించారు.
ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులందరితో అవినీతి రహితంగా ఉద్యోగాలను నిర్వహిస్తామనే ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని 2025 అక్టోబర్ 27 నుండి సెప్టెంబర్ 22 వరకు అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో 2025 విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సందర్భంగా” విజిలెన్స్ – మన ఉమ్మడి బాధ్యత ” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు ,ఉద్యోగులు, సచివాలయ వార్డు కార్యదర్శులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అవినీతిరహితంగా,ప్రజాసేవా భావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలని సూచించారు. మనందరం ప్రభుత్వ ఉద్యోగులమేనని ప్రభుత్వం మన పనికి తగిన జీతం ఇస్తుందని, అందువలన ప్రజలు అందించే సేవలలో ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా వారికి సహకరించాలన్నారు. సంస్థలో ఒకరు అవినీతి చేస్తే ఆ చెడ్డపేరు ఆ సంస్థకు వస్తుందని, ఉద్యోగ ధర్మంతో పాటు బాధ్యతలు తెలుసుకొని ప్రజలకు సహాయం చేయాలన్నారు. ఉద్యోగులు సేవా భావంతో చేసే నిజాయితీ, నిబద్ధతలకు ప్రతిఫలంగా మంచి ఫలితాలు దక్కుతాయన్నారు . ధర్మాన్ని వీడి అవినీతి జోలికి పోరాదని, అవినీతితో సంపాదించే సొమ్ము కుటుంబాన్ని రోగాలలో నెట్టుతోందని, అది ఎప్పుడూ నిలవదని తెలిపారు. అవినీతి నిరోధశాఖకు చిన్న ,పెద్ద, స్త్రీ పురుష, లింగ బేధం అన్న తేడా ఉండదని ఉద్యోగి ఏ స్థాయిలో వాడైన అవినీతి చేస్తే వదలదని, ఏసీబీలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయని వాటిలో ఏ సెక్షన్ కిందనైనా ఉద్యోగి దొరికితే జైలు పాలై కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని, దీని వలన కుటుంబం, పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడమే కాకుండా సమాజంలో, కులంలో బంధువులు దూరం చేస్తారన్నారు . దేశంలో ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో ఎటువంటి అవినీతికి తావివ్వకుండా తమ ఉద్యోగ ధర్మాన్ని నెరవేస్తే దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు .తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుండి మంచి నడవడిక, ధర్మం, పుణ్యం వంటివి నేర్పాలన్నారు.
ప్రజలు ప్రభుత్వ సేవలకు ఉద్యోగుల వద్దకు వచ్చినప్పుడు అవినీతి రహితంగా సేవలందించాలని, లంచం అడిగితే ప్రజలు సిద్ధమై తప్పకుండా ఏసీబీ ఫోన్ నెంబర్ 1064 కు ఫోన్ చేస్తారని, ఆపై లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టు పడడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు ఏ విధమైన దుర్బల జీవితాన్ని అనుభవిస్తున్నారో వివరించారు. అనంతరం ఆయన ఈ వారోత్సవాలలో భాగంగా నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుండి పార్కు హోటల్ వరకు నిర్వహించనున్న సైకిల్ ర్యాలీలో జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని డి.ఎస్.పి రమణమూర్తి కోరారు.
మన ఉద్యోగం ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అని మన అధికారాన్ని , ఉద్యోగ ధర్మాన్ని సద్వినియోగం చేసుకొని ఎటువంటి అవినీతికి, లాభపేక్షకు తావివ్వకుండా సమస్యలతో వచ్చిన వారి సమస్యలను మన సమస్యలుగా భావించి విధులు నిర్వహించి సంస్థకు కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) శ్రీనివాసరావు పేర్కొన్నారు .
ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేరిన నాటి నుండి మన బాధ్యతలు తెలుసుకొని ప్రజలకు సేవ చేసే మంచి గుణాన్ని అలవరచుకోవాలని, పాపం, పుణ్యం, ధర్మం వీటిని తెలుసుకొని ప్రజలకు సేవ చేయు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని జీవీఎంసీ కార్యదర్శి బీ.వీ. రమణ తెలిపారు.
అనంతరం అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థంగా దేశంలో అతిపెద్ద సంస్థ అయిన అవినీతి నిరోధక శాఖ అవినీతికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లంచం అడిగినా, తీసుకున్నా ,ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినా నేరమేనని, మనం సమాజ సేవ కొరకు విధులు నిర్వహిస్తున్నామని, అవినీతి శాఖ కేసులో ఇరుక్కుంటే వారి కుటుంబం పై భారం పడుతుందని ,ఉద్యోగి జీవితం చాలా దుర్భలంగా మారుతుందన్నారు. మనకు ప్రభుత్వం ఇచ్చిన జీతంతోనే సర్దుకోవాలని ఎటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడరాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్లు మల్లయ్య నాయుడు ,బి .రాము ,కె .కనకమహాలక్ష్మి, బి.ఆర్.ఎస్ .శేషాద్రి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎ .అప్పలనాయుడు , స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు,అధికారులు, ఉద్యోగులు, సచివాలయాల వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు


