-వరద ప్రభావాన్ని వెంటనే తెలియజేయండి; సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలి
చిట్వేల్, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలోని గుంజన నది పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చిట్వేల్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.ఇటీవలి భారీ వర్షాల కారణంగా గుంజన నదిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని, వరద ప్రభావం కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
-అత్యవసర సమాచారంపై దృష్టి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే తమకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. సమాచారం అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా చిట్వేల్ సచివాలయం, పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు పంచాయతీ తరఫున ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఉప సర్పంచ్ తెలిపారు. గుంజన నది ప్రవాహం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


