



మనలో నిగూఢంగా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలపై విజయం సాధించి, దైవత్వాన్ని మేల్కొలపడమే దసరా నవరాత్రి ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని, దుర్గా పూజ పరమార్థమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు ఉద్ఘాటించారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సత్సంగంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ, “శారీరక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంత అవసరమో, మానసిక వికాసానికి, అంతర్గత పరివర్తనకు యోగా, ధ్యానం, సుదర్శన క్రియ అంతే ముఖ్యం. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను జయించడానికి సుదర్శన క్రియ ఒక దివ్యమైన సాధనం. ప్రతిరోజూ యోగా, క్రియను అభ్యసించడం ద్వారా ఒత్తిడి లేని జీవితం, మానసిక ప్రశాంతత, మెరుగైన పనితీరు సాధించవచ్చు. తద్వారా మన జీవనశైలిలోనే ఒక సానుకూల మార్పు వస్తుంది” అని వివరించారు. చెడుపై దేవి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ నాడు, మనలోని ప్రతికూల గుణాలపై మనం విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో సాగింది. చౌదరి శ్రీనివాస్, గేదెల ఉమా దేవి, రామ్మోహనరావు, ఠాగూర్ దాస్, దార్లపూడి రవి బృందం సభ్యులు ఆలపించిన భజన గీతాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరికి తబలాపై లక్ష్మణ్ రావు అందించిన వాద్య సహకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సత్సంగంలో డిడిసి సభ్యులు శిల్లా రమేష్, బి.వి. రవిశంకర్, వరదా వెంకట ఆనంద్, మాధవి, ఉమారాణి , సురంగి మోహన రావు, ఉపాధ్యాయులు, ప్రముఖ న్యాయవాది వి. సుధారాణి , నంబళ్ళ కల్పన, వారణాసి సందీప్, దేసూళ సురేంద్ర, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు పూడి శ్రీనివాస్ రెడ్డి, దేసూళ కాత్యాయని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

