ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను పునరుద్ధరించే విధంగా పారిశ్రామిక పాలసీ రూపకల్పన
ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం నియోజకవర్గ పున్నమి ప్రతినిధి
గన్నవరం నియోజకవర్గానికి రెండు యం.ఎస్.యం.ఈ లు కేటాయించినందుకు ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ధన్యవాదాలు తెలిపారు.
ఈరోజు జరిగిన ఏపి శాసనసభ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ గా అభివర్ణించారు. ప్రస్తుతం ఏపీ లో పరిశ్రమల అభివృద్ధికి అమలు చేస్తున్న స్ట్రాటజీ 4.o మరియు పారిశ్రామిక ప్రోత్సాహకాలు బ్రాండ్ ఆంధ్రాను పునరుద్ధరించే విధంగా ఉన్నాయని తెలిపారు. బ్రాండ్ సి.బి.ఎన్, లోకేష్ బాబు కృషితో దిగ్గజ ఐటీ సంస్థలైనా టి.సి.ఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో అశోక్ లేలాండ్ కంపెనీని వెనక్కి తీసుకొచ్చామని, ముఖ్యమంత్రి సహకారంతో పాత ధరలకే పరిశ్రమలకు భూములను కేటాయించామని గుర్తు చేశారు. మల్లవల్లి ఎస్.ఈ.జెడ్ ను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టామని తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో 31% ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని దానికి అనుగుణంగా విమానాశ్రయ విస్తరణ పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడ లో 2024 కి ముందు 2800 గా ఉన్న ఎంప్లాయిమెంట్ సంఖ్య ప్రస్తుతం 6000 కు చేరిందని తెలిపారు. మల్లవల్లి పారిశ్రామికవాడ లో పరిపాలన భవనం, 132 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ మరియు నీటి సౌకర్యం తదితర అంశాలను త్వరితగతిన ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీరపనేనిగూడెంలో ఎం.ఎస్.ఎం.ఈ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి 30 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అమర్ రాజా బ్యాటరీస్, లూలూ గ్రూప్, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయని, గన్నవరం నియోజకవర్గ పరిధిలో అశోక్ లేలాండ్ సంస్థను సైతం వెనక్కి పంపి నిరుద్యోగ శాతాన్ని పెంచారని విమర్శించారు. ప్రస్తుతం ఏపి లో పరిశ్రమల స్థాపనకు ఇన్స్టంట్ అప్రూవల్స్, డీమ్డ్ అప్రూవల్స్ వంటి సంస్కరణలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.


