సూర్యాపేట, మే 25: సూర్యాపేట రూరల్ మండలం ఏర్కారం గ్రామ శివారులో మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు (42) హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, ఒక బైకు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం మిస్సింగ్ అయిన మధు మృతదేహం శనివారం ఏర్కారం గ్రామ శివారులోని కల్వర్టు కింద గోనెసంచిలో లభ్యమైంది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
దర్యాప్తులో 2007లో ఏర్కారం మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉండటంతో, ఆ ఘటనకు ప్రతీకారంగా రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ హత్యకు పథకం రచించినట్లు వెల్లడైంది.
నిందితులు మధును స్నేహితుల పేరుతో సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలోని అద్దె ఇంటికి పిలిచి మద్యం తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి కారులో తీసుకెళ్లి ఏర్కారం శివారులో పడవేసినట్లు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా టేకుమట్ల సమీప జాతీయ రహదారి-65 వద్ద ప్రధాన నిందితులు మిద్దె జీవన్, మిద్దె ఆనంద్లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వారి సమాచారంతో మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్నవి
ఒక కారు
ఒక బైకు
హత్యకు ఉపయోగించిన కత్తి
ఐదు సెల్ఫోన్లు
నిందితులపై గత కేసులు
మిద్దె జీవన్పై 4 కేసులు
చింత సైదులుపై 2 కేసులు
మేదిరి ప్రసాద్పై 1 కేసు
మిద్దె ఆనంద్పై 4 కేసులు
హత్యలు, భౌతిక దాడులు వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులోనూ త్వరితగతిన శిక్షలు పడేలా పకడ్బందీగా చార్జిషీట్ దాఖలు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, శివకుమార్, రామారావు, ఎస్సైలు మరియు ప్రత్యేక బృంద సభ్యులను ఎస్పీ అభినందించారు.


