రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 6 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆరో రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై ఆందోళన చేపట్టారు. గ్రామాలకు కేంద్రం నుంచి అందుతున్న ఆర్థిక నిధులు సిబ్బంది జీతాలు, నిర్వహణకే సరిపోతున్నాయని, కొత్తగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో సిరిసిల్లను దత్తత తీసుకుంటానన్న సీఎం రేవంత్రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు. 1000 రోజుల పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


