*హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం.. వచ్చే రెండున్నరేళ్లు తెలంగాణ వికాసానికే అంకితం: సీఎం రేవంత్ రెడ్డి*
హైదరాబాద్, జూన్ 9: రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ఎజెండాగా లక్ష్యాలను చేరుకునేందుకు వచ్చే రెండున్నరేళ్లు నిరంతరం తెలంగాణ వికాసం కోసం పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు. దేశంలోని మహానగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మియాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి పరిధిలోని గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వ కార్యాచరణను వివరించారు.
రాయదుర్గం నుంచి నియోపోలిస్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని పేర్కొన్న సీఎం, హైదరాబాద్ను విశ్వనగరంగా చెప్పుకోవడం మాత్రమే కాకుండా, దానికి తగిన విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తామని తెలిపారు.
నగరంలో పేదలకు గృహాల అవసరం ఉందని గుర్తుచేస్తూ లక్ష ఎల్ఐజీ (లో ఇన్కమ్ గ్రూప్), ఎంఐజీ (మిడిల్ ఇన్కమ్ గ్రూప్) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే సమీపంగా ఇళ్లు కట్టించి కేటాయించే దిశగా ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నామని వెల్లడించారు.
దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. వాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ప్రస్తుతం ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లోపలి ప్రాంతంలో సుమారు 1.34 కోట్ల జనాభా నివసిస్తోందని, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్కు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారని చెప్పారు. సమన్వయం లేని పరిపాలన వల్ల తాగునీరు, రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, చెత్త నిర్వహణ, విద్యుత్, పోలీసింగ్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. అందుకే నిపుణులతో చర్చించి 2100 చ.కి.మీ విస్తీర్ణాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు తెలిపారు.
150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా వికేంద్రీకరణ చేపట్టామని, వాటికి అనుగుణంగా పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. అభివృద్ధి విషయంలో రాజకీయ వివక్ష లేదని, ఎన్నికల సమయంలో రాజకీయాలు మాట్లాడుకుందామని, అప్పటివరకు అన్ని పక్షాలు అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

