సూళ్ళూరుపేటలో దోపిడీ దొంగల అరెస్ట్.. గంజాయి మత్తుకు బానిసై నేరాలు! 11_08_26
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జీ.చెంచుబాబు ఆధ్వర్యంలో,సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్ నేరస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 169/2026 U/s 309(4) BNS Robbery కేసులో ఈ దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
పట్టణంలో కలకలం సృష్టించిన దోపిడీ కేసును స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని కత్తితో బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకుంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 అంగుళాల పెద్ద కత్తి, వివో ఆండ్రోయిడ్ సెల్ఫోన్, రూ. 200 నగదును మధ్యవర్తులు స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీసుల వివరాల ప్రకారం…NH-16 జాతీయ రహదారిపై శ్రీచెంగాళమ్మ గుడి ఆర్చ్ సమీపంలో ఎస్సై అజయ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సదరు క్రైమ్ కేసు ముద్దాయిల గురించి సమాచారం ఉండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు 1) కిలివేటి జగదీష్ @ జగన్ (కోటపోలూరు), 2) ముటుకు దిలీప్ @ ఢిల్లీ (వట్రపాలెం), 3) కొల్లచెరువు లోకేష్ @ లోకి (వట్రపాలెం)లుగా తేలింది.
ఈ నిందితులకు గంజాయి, మద్యం త్రాగే అలవాటు ఉంది. కూలి పనులు చేసుకునే వీరు సంపాదించే డబ్బు జల్సాలకు, మత్తు పదార్థాలకు సరిపోక సులువుగా డబ్బు సంపాదించాలనినిర్ణయించుకున్నారుఈ నెల 7వ తేదీ రాత్రి వట్రపాలెం మొదటి వీధిలో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఈ ముగ్గురు మరియు పరారీలో ఉన్న అఫ్రిద్ కలిసి కత్తితో బెదిరించి సెల్ఫోన్, రూ. 1,000 దోచుకెళ్లారు. ఆ డబ్బుతో మద్యం తాగి, మిగిలిన రూ. 200 లోకేష్ వద్ద, సెల్ఫోన్ను దిలీప్ వద్ద దాచారు.
సోమవారం ఉదయం మరో నేరానికి పాల్పడేందుకు ఆర్చ్ వద్దకు రాగా పోలీసులకు చిక్కారు. గంజాయి మత్తుకు బానిసైన యువత ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు, పరారీలో ఉన్న అఫ్రిద్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

