సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్.కే.ఆర్. నగర్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన సాయి గణేష్ మందిరంలో గురువారం నాలుగో రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యక్రమానికి ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు హాజరై సాయి గణేష్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. సీఐ స్వయంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, యువత శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే ప్రాంతాల్లో భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జింకా శ్రీనివాసులు,ఉక్కడాల శివ, జొన్నాదుల శ్రీనివాసులు, నూకల సుబ్బరాయుడు,దాసరి బాబు,మునగపాటి తేజ, తదితరులు పాల్గొన్నారు.


