అనపర్తి, జూలై 24 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): గోదావరి జిల్లాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ‘అపర భగీరథుడు’ సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతిని పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరంలో ఆయన విగ్రహానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యంలో జన్మించిన సర్ ఆర్థర్ కాటన్ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణా డెల్టా రైతాంగానికి అపూర్వమైన సేవలు అందించారని కొనియాడారు. బ్రిటిష్ ప్రభుత్వం, అధికారుల వ్యతిరేకతను సైతం అధిగమించి గోదావరి ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టి, గోదావరి జలాలను కాలువల ద్వారా వ్యవసాయానికి మళ్లించి రైతాంగ అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు కాటన్ అని పేర్కొన్నారు.
గ్రావిటీ విధానంలో సాగునీరు అందేలా గోదావరి డెల్టాను సుసంపన్నంగా తీర్చిదిద్దిన ఘనత సర్ ఆర్థర్ కాటన్కే దక్కుతుందన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ పూర్వీకులు తమ పిల్లలకు ‘కాటన్ రాజు’, ‘కాటన్ రెడ్డి’, ‘కాటన్’ వంటి పేర్లు పెట్టుకునే వారని, నేటి తరాలు కూడా ఆయన సేవలను ఎప్పటికీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
విదేశీయుడైనప్పటికీ భారతదేశంపై, ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టా రైతాంగంపై అపారమైన ప్రేమతో పనిచేసిన సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. రామవరంలో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం శిథిలావస్థకు చేరుకుందని, త్వరలోనే అక్కడ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.



