ప్రజలు నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలి: సబ్ రిజిస్ట్రార్ టి. శ్రీనివాసరావు
ఆత్మకూరు, జూలై 27 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్ల సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని సబ్ రిజిస్ట్రార్ టి. శ్రీనివాసరావు తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే ప్రజలు తమ ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలతో నేరుగా కార్యాలయాన్ని సంప్రదిస్తే అవసరమైన పత్రాలను కార్యాలయంలోనే సిద్ధం చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అదే రోజు సాయంత్రానికి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకుని వస్తే, చలానా చెల్లింపు తదితర ప్రక్రియ పూర్తి చేసి వెంటనే రిజిస్ట్రేషన్ నిర్వహిస్తామని చెప్పారు.
అలాగే అవసరమైన స్టాంపులు కూడా కార్యాలయంలోనే విక్రయిస్తున్నామని, ప్రజలు వాటిని నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించారు. కార్యాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నారని, సమ్మెతో సంబంధం లేకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవాలని సబ్ రిజిస్ట్రార్ టి. శ్రీనివాసరావు కోరారు.



