గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్
నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లలో సచివాలయాల పనితీరు, సిబ్బంది గైర్హాజరు, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యంపై ప్రజల నుండి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం రామవరప్పాడు-1, 2, 3, ప్రసాదంపాడు-2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ తనిఖీలలో సచివాలయ వ్యవస్థలోని లోపాలను ఆయన గుర్తించారు. తనిఖీ సమయంలో పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని ఎమ్మెల్యే గమనించారు. సెలవులో ఉన్నవారు మాన్యువల్ రిజిస్టర్ నమోదు చేసినప్పటికీ, ఆన్లైన్ సిస్టమ్ లో ఎందుకు నమోదు చేయలేదని అధికారులను నిలదీశారు. ముఖ్యంగా విజిటర్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, ఇన్వర్డ్, అవుట్వర్డ్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సచివాలయాల్లో విజిటర్స్ రిజిస్టర్ అసలు లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. కేవలం 2,300 ఓట్లు ఉన్న గూడవల్లి వంటి చిన్న గ్రామాల్లో 10 మంది సచివాలయ సిబ్బంది ఉండగా, దాదాపు 23,000 ఓట్లు, 50,000 జనాభా ఉన్న రామవరప్పాడు వంటి పెద్ద గ్రామాలకు కేవలం 25–30 మంది సిబ్బంది మాత్రమే ఉండటాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. జనాభా ప్రాతిపదికన సిబ్బందిని హేతుబద్ధీకరించేలా జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. 50,000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదని, వెలగలేరు వంటి చిన్న పల్లెటూర్లలో పీహెచ్సీ ఉండగా, ఇంత పెద్ద జనాభా ఉన్న రామవరప్పాడు ప్రాంతంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇక్కడ వెంటనే పీహెచ్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రామవరప్పాడు-2 సచివాలయం నిర్వహిస్తున్న అద్దె భవనం అస్తవ్యస్తంగా ఉందని, పెచ్చులు ఊడిపోయి ప్రమాదకరంగా మారిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. నెలకు రూ. 15,000 అద్దె చెల్లిస్తున్నప్పటికీ, ప్రజలు కూర్చోవడానికి కూడా స్థలం లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆగిపోయిన సచివాలయ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే కొత్త భవనాల్లోకి మారుస్తామని చెప్పారు. మార్చి నెలలో రామవరప్పాడు సచివాలయం-2లో కేవలం 38 మందికి, మరో రెండు సచివాలయాల్లో 28, 35 మందికి మాత్రమే సేవలు అందించడంపై ఎమ్మెల్యే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో జనాభా ఉన్న చోట ఇంత తక్కువ మందికి సేవలు అందడం అంటే సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేరని అర్థమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఒక ఇంజనీర్ను కేటాయించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. గతంలో మండలానికి ఒక ఇంజనీర్ ఉన్నప్పుడే పనులు మెరుగ్గా సాగేవని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ఆస్తిలా ఉండాలి తప్ప, కేవలం సమస్యలకు సాక్షులుగా మిగిలిపోకూడదని అన్నారు. నిబంధనల ప్రకారం రిజిస్టర్లు నిర్వహించని వారికి మెమోలు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వచ్చే వారం విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాల్లోని మొత్తం 21 సచివాలయాల సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. విజిటర్స్ రిజిస్టర్, సర్వీస్ రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల కోసం ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచిస్తూ, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.



