పున్నమి ప్రతినిధి,తిరుపతి, జూలై 25
– మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన.
– బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలపై చైతన్యం.
– శక్తి యాప్, డయల్-112 వినియోగంపై సూచనలు.
– సోషల్ మీడియా, డిజిటల్ మోసాలపై జాగ్రత్తలు.
తిరుపతి జులై 25: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో శక్తి టీం పోలీసులు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణపురం సమీపంలోని శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద మహిళలు, చిన్నారులతో సమావేశం నిర్వహించి మహిళలపై నేరాలు, బాల్య వివాహాలు, చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్, మహిళల అక్రమ రవాణా, కార్యాలయాల్లో వేధింపులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, OTP మోసాలు, చైన్ స్నాచింగ్, రాపిడో/ఆటో ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించడం, గుర్తు తెలియని వ్యక్తులు, లింకులు, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు సందేశం ఇస్తూ…మహిళలు, చిన్నారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఎస్పీ తెలిపారు. వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.



