విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 1:
ఆనందపురం–పెందుర్తి ప్రధాన రహదారిపై ఉన్న సింహాచలం చెక్పోస్ట్ ప్రాంతం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతోంది. కొత్త నివాస కాలనీలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు ఏర్పడుతుండటంతో పాటు నిత్యం వేలాది మంది ప్రజలు, వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఏటీఎం కేంద్రం లేకపోవడంతో నగదు అవసరాల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా, రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యవసరంగా చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాల సమయంలో వేగవంతమైన విచారణ, ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
అభివృద్ధి వేగాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సింహాచలం చెక్పోస్ట్ ప్రాంతంలో జాతీయ బ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక సీసీ కెమెరాల వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చర్యలు అమలైతే ప్రజలకు భద్రత, సౌకర్యం పెరగడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


