అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ పరిధిలోని వేంగడ గ్రామంలో భూమి రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. భూమి రీ-సర్వే బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేంగడ గ్రామ వీఆర్వో రాంబాబు, సర్వేయర్ సువిత్రి, మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు, మాజీ ఎంపీటీసీ గంగన్న,సూపర్ సర్పంచ్ బుట్టన్న పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల అనంతరం తమ గ్రామానికి భూమి రీ-సర్వే బృందం రావడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా రీ-సర్వే కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ద్వారా తమ భూములకు స్పష్టమైన హక్కులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీఆర్వో రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం భూముల రీ-సర్వే చేపట్టిందని, ప్రతి రైతు తన భూమి వద్ద స్వయంగా ఉండి సర్వే ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సూచించారు. భూమికి సంబంధించిన వివరాలను పరిశీలించి, సర్వే సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని కోరారు.
మాజీ సర్పంచ్ సివేరి కొండలరావు మాట్లాడుతూ.. వేంగడ గ్రామ ప్రజలు గత కొన్నేళ్లుగా భూమి రీ-సర్వే కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గ్రామంలోని ప్రతి రైతు తమ భూముల వద్ద ఉండి రీ-సర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూములకు పట్టాలు లభిస్తే రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన భూమి రీ-సర్వే ప్రక్రియలో గ్రామస్థులందరూ భాగస్వాములు కావాలని, తమ భూములకు సంబంధించిన ఆధారాలను సిద్ధంగా ఉంచుకుని అధికారులకు సహకరించాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మజ్జి మత్యారాజు, భగత్ రామ్, మాజీ వైస్ సర్పంచ్ మజ్జి రాము, మాజీ వైస్ సర్పంచ్ కొంతేరి రామనాయుడు, వార్డు సభ్యులు మజ్జి గోవింద్, మజ్జి బీమన్న, ఎం.డి. కేశవ్, గోవింద్ సెల్స్మెన్ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.



