విలేకరులపై అడిషనల్ కలెక్టర్ అహంకారం!
మంత్రివర్గం స్పందించాలి, చర్యలు తీసుకోవాలి: ఏన్కూరు జర్నలిస్టుల డిమాండ్
జులై 23 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
ఏన్కూరు
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలిచే పత్రికారంగం పట్ల ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ అనుసరిస్తున్న చులకన భావన, నిర్లక్ష్య వైఖరి తీవ్ర నిరసనలకు దారితీస్తోంది. మండలాల పర్యటనల సమయంలో అధికారిక సమాచారం కోసం వచ్చే విలేకరులను ఉద్దేశించి “ఇంకా మీరెందుకు ఉన్నారు? ఒక ఫోటో తీసుకుని వెళ్లిపోండి” అంటూ ఆమె తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ఏన్కూరు మండల జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమాజంలోని ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే పాత్రికేయుల పట్లే ఈ తరహా అహంకార పూరిత ధోరణి ప్రదర్శిస్తే, ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే సాధారణ ప్రజలకు ఎలాంటి గౌరవం, న్యాయం లభిస్తుందని వారు ప్రశ్నించారు. బాధ్యతలు స్వీకరించి నెలలు గడుస్తున్నా జిల్లా అభివృద్ధికి చేసిన కృషి ఏంటో, ఎన్ని సమస్యలను పరిష్కరించారో కలెక్టర్ వెల్లడించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మం జిల్లాలో మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, అధికారులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఇటువంటి అధికారులు మండల పర్యటనలకు రాకపోయినా పర్వాలేదని, అయితే జర్నలిస్టులను అవమానించే ధోరణి కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రాధాన్యతను గుర్తించాలని హితవు పలికిన పాత్రికేయులు, ఈ అంశంపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని కోరారు. విలేకరుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అడిషనల్ కలెక్టర్పై తగిన చర్యలు తీసుకుని, ఆమెను జిల్లా నుంచి తక్షణమే బదిలీ చేయాలని ఏన్కూరు మండల జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



