రేపు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
రూ.83 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన – హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్లకు శ్రీకారం
నల్గొండ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చే పలు కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3.35 గంటలకు కనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని, రూ.83 కోట్ల వ్యయంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు చేయనున్న డ్రింకింగ్ వాటర్ స్కీమ్ – ఫేజ్-1 పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం ద్వారా నగర ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. సభా ప్రాంగణంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంతో పాటు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.



