నగరంలో నకిలీ పత్రాలతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను అమ్ముతూ ‘భూమాఫియా’ అమాయకులను ముంచేస్తోంది. మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న రూ.120 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని, అలాగే మంచేపాలలో మరొకరి పేరిట ఉన్న 400 గజాల స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో విక్రయించి కోట్లలో వసూలు చేసిన ఉదంతాలు వెలుగుచూశాయి.
ఈ నేపథ్యంలో ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
లీగల్ ఒపీనియన్:- అనుభవజ్ఞుడైన న్యాయవాది ద్వారా గత 30 నుండి 40 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. జెరాక్స్ కాపీలను నమ్మకూడదు.
నిషేధిత భూములు (22A):- సదరు భూమి దేవాదాయ, వక్ఫ్ బోర్డు, లేదా ప్రభుత్వ స్థలం కాదని నిర్ధారించుకోవడానికి తహసీల్దార్ కార్యాలయంలోని ’22A నిషేధిత భూముల జాబితా’ను పరిశీలించాలి.
అప్రూవల్స్ పరిశీలన: ప్లాట్ లేఅవుట్ నంబర్ (LP నంబర్) నిజమైనదో కాదో అధికారిక వెబ్సైట్లో చెక్ చేయాలి. నిబంధనల ప్రకారం డెవలపర్ వేసిన మార్టిగేజ్ (15% ప్లాట్లు) కాకుండా మిగిలిన ప్లాట్లను మాత్రమే కొనాలి.
భూమి రకం (నాలా):- వ్యవసాయ భూమిని నివాస స్థలంగా (నాలా) మార్చినట్లు రెవెన్యూ రికార్డులు (1-B, అడంగల్, ఎఫ్ఎంబి) సరిచూసుకోవాలి.
మాస్టర్ ప్లాన్ & సరిహద్దులు: మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతం నివాస ప్రాంతమా కాదా అని తెలుసుకోవాలి. లైసెన్స్డ్ సర్వేయర్తో సరిహద్దులు కొలిపించి, లోకల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించిన తర్వాతే పూర్తి రిజిస్ట్రేషన్ (సేల్ డీడ్) ప్రక్రియకు సిద్ధమవ్వాలి.


