రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల మధ్య సమన్వయం కొరవడిందని టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు. రాజంపేటలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సీనియర్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ప్రస్తుతం నియోజకవర్గంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం సాధించడంలో పార్టీ ఇన్చార్జి విఫలమయ్యారని కొమరా వెంకట నరసయ్య ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించి వెంటనే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు.పార్టీ పరిశీలకుడిగా ఉన్న వ్యక్తి కూడా నాయకుల మధ్య విభేదాలను సమన్వయపరచడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఒకే విధమైన ధోరణితో వ్యవహరిస్తూ, కొందరు నాయకులకు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. పరిశీలకుడు రిమోట్ కంట్రోల్ మాదిరిగా వ్యవహరించడం వల్ల క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అధిష్టానానికి చేరడం లేదని అన్నారు. ఫలితంగా ఆరు మండలాల్లో పార్టీ పరిస్థితి బలహీనపడుతోందని పేర్కొన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన పలువురు నాయకులు, కార్యకర్తలకు తగిన పదవులు, పనులు దక్కలేదని కొమరా వెంకట నరసయ్య అన్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలలో ఉన్న అసంతృప్తిని నాయకత్వం గుర్తించి పరిష్కరించకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బంధించిన సమయంలో పార్టీ కోసం రోడ్డెక్కి పోరాడిన కార్యకర్తలు, నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ సమయంలో ఒక్కరోజు కూడా, ఒక్క నిమిషం కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేయని కొందరు ప్రస్తుతం అధికారాన్ని చెలాయించడం బాధాకరంగా ఉందని విమర్శించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని విస్మరించడం వల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడుతుందని అన్నారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు ఉన్నం కిరణ్ స్వామి మాట్లాడుతూ.. పార్టీ ఇన్చార్జి వ్యవహారశైలిపై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు వెళితే పార్టీకి అన్ని స్థానాల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. వెంటనే పార్టీ కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తల సమస్యలను తెలుసుకోవాలని కోరారు.నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పార్టీ నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడానికి ఎవరూ ప్రత్యేకంగా కృషి చేయడం లేదని కిరణ్ స్వామి అన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి బలహీనపడుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేసుకుని నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.పార్టీలో నెలకొన్న సమన్వయ లోపాన్ని వెంటనే సరిదిద్దకపోతే వరుస పరాజయాలు తప్పవని నాయకులు హెచ్చరించారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వారు కోరారు.కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు పుత్త రామచంద్రయ్య, సీనియర్ నాయకులు మామిల్లి ఈశ్వరయ్య, పామూరు సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ పార్టీ మాజీ కార్యదర్శి కణితం రామ్మోహన్ నాయుడు, పసుపులేటి మల్లికార్జున, గంగపేరూరు కృష్ణారెడ్డి, మైనార్టీ నాయకుడు సయ్యద్ చాంద్ భాషా, రాచపల్లి నాయకుడు మౌలాలి, మలక్కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్కూరు విజయరామయ్య, ఆడిటర్ శివానంద రాయల్తో పాటు పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


