ఆత్మకూరు, జూన్ 13(హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఉపాధ్యాయ ఉద్యమ పితామహులు, స్ఫూర్తి ప్రదాత మార్పు బాలకృష్ణమ్మ గారి జయంతి సందర్భంగా శనివారం ఆత్మకూరు పట్టణంలోని ఏపీటీఎఫ్ డివిజన్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, సంఘం నాయకులు పాల్గొని మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ మార్పు బాలకృష్ణమ్మ ఉపాధ్యాయ ఉద్యమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఉపాధ్యాయులు ప్రస్తుతం పొందుతున్న రీగ్రూపింగ్ స్కేళ్లు, అప్రయత్న యాంత్రిక పదోన్నతులు, 010 పద్దు కింద జీతాల చెల్లింపులు వంటి అనేక సౌకర్యాలు మార్పు బాలకృష్ణమ్మ పోరాటాల ఫలితంగానే సాధించుకున్నామని గుర్తు చేశారు.మార్పు బాలకృష్ణమ్మ కేవలం ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగానే కాకుండా శాసనమండలిలో రైతాంగ సమస్యలపై కూడా గళమెత్తిన మహనీయుడని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ఆయన ఉద్యమాల కోసం జైలు జీవితం కూడా అనుభవించారని తెలిపారు.ప్రస్తుత తరం ఉపాధ్యాయులు బలమైన ఉద్యమాలను నిర్మించి, విద్యా రంగ అభివృద్ధికి కృషి చేసినప్పుడే మార్పు బాలకృష్ణమ్మ ఆశయాలకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని సురేంద్ర రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఆర్. వెంకటేశ్వర్లు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి పెంచలయ్య, జిల్లా బాధ్యులు శివకుమార్, మండల బాధ్యులు రత్నారెడ్డి, శివరామిరెడ్డి, తిరుపతిరెడ్డి, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


