దుత్తలూరు మండలంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తిరుగు ప్రయాణంలో వింజమూరు వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఒక ప్రమాదకర ఘటనను గమనించి వెంటనే స్పందించారు.జాతీయ రహదారిపై ఓ లారీని సుమారు 14 సంవత్సరాల వయస్సు గల బాలుడు నడుపుతున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే ఆ వాహనాన్ని ఆపించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా లారీలో ఉన్న బాలుడి తండ్రి మద్యం సేవించిన స్థితిలో ఉండి, తాను తన కుమారుడికి డ్రైవింగ్ నేర్పిస్తున్నానని సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, మైనర్ బాలుడితో వాహనాలు నడిపించడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంతో సమానమని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్ల చేత వాహనాలు నడిపించడం వంటి చర్యలు ఏ క్షణంలోనైనా ఘోర రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్కడికక్కడే పోలీసు వారి సమక్షంలో సంబంధిత వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆ లారీని పోలీస్ స్టేషన్కు తరలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు అప్పగించకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి వాహనదారుడు అప్రమత్తంగా వ్యవహరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపితేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని ఆయన స్పష్టం చేశారు.




