నందలూరు: మండల కేంద్రంలోని ప్రముఖ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం వెనుక ఉన్న బ్రాహ్మణ వీధి వినాయక మండపం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక లడ్డూ వేలం పాటను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ఉంచిన 21 కేజీల మహా లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు.
ఈ వేలం పాటలో గ్రామానికి చెందిన వుల్లి ఉపేంద్ర రూ.63,100లకు లడ్డూను దక్కించుకున్నారు. గతంలో ఈ లడ్డూను దక్కించుకున్న వారికి శుభఫలితాలు కలిగాయని విశ్వసిస్తూ, ఈసారి కూడా భక్తులు వేలంలో ఆసక్తిగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వేలం అనంతరం లడ్డూను దక్కించుకున్న వుల్లి ఉపేంద్రను శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వుల్లి ఉపేంద్ర మాట్లాడుతూ, కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో తమ కుటుంబం లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విఘ్నేశ్వర భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


