ఖానాపూర్ ఆగస్టు 15( పున్నమి ప్రతినిధి )
ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు, జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ.. పరాయి పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భారతమాత స్వయంపాలన దిశగా అడుగులు వేసి నేటికి 80 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. స్వాతంత్ర్య సాధన కోసం త్యాగనిరతితో పోరాడిన ఎందరో అమరవీరులు, దేశభక్తుల ఆత్మార్పణలు మహోన్నతమైనవని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో నడిపించిన మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం దేశ స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అదే స్ఫూర్తితో కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ముందుకు సాగిందని అన్నారు.స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణమని జాన్సన్ నాయక్ గారు పేర్కొన్నారు._
అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌక్ వద్ద, పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



