*ప్రజావాణిలో ఖాళీ కుర్చీలు.. సమయానికి రాని అధికారులు!*
*ఏన్కూరు మండలంలో అధికారుల సమయపాలనపై ప్రజల అసంతృప్తి*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాల్సిన మండల స్థాయి అధికారులు ప్రజావాణి సమయంలో అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సి ఉండగా, సమయపాలన పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండల అధికారులే సమయపాలన పాటించకపోవడానికి కారణం ఏమిటి? ప్రజావాణికి ఆలస్యంగా వచ్చే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, అధికారులు నిర్ణీత సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

