ఖమ్మం 1 టౌన్ పరిధిలోని 21వ డివిజన్ పార్శిబందం బస్తీలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా ప్రభారి కొండపల్లి శ్రీధర్ రెడ్డి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మట్టి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న బస్తీ ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మట్టి గణపతి ఉత్సవాలను ప్రోత్సహించాలని కమిటీ సభ్యులకు కోరారు. కార్యక్రమంలో బోయినపల్లి చంద్రశేఖర్, భక్తులు పాల్గొన్నారు.



