మంథని పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ నిర్వహణ
మంథని, సెప్టెంబరు 05:
రాబోయే వినాయక చవితి (సెప్టెంబరు 14) పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లకు సీఐ బి. స్వామి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతు పండుగ వాతావరణానికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బలవంతపు చందా వసూళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుంపులుగా ఏర్పడటం, పాత విరోధాలతో ఘర్షణలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేషన్ పరిధి విడిచి వెళ్లాల్సి వస్తే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. పండుగ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ (నైట్ రౌండ్స్), బీట్ చెకింగ్లు పెంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే మంథని పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ కుమార్, ఏఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.


