ఖమ్మం, ఆగస్టు 3
( పున్నమి న్యూస్):
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణు కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అత్యంత బాధాకరమని బీజేపీ జాతీయ కో-ఇన్చార్జి (తమిళనాడు, కర్ణాటక), మాజీ ఎమ్మెల్సీ Ponguleti Sudhakar Reddy పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నిరుద్యోగ యువత గొంతు వినిపించిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నెలకొందని అన్నారు.
తెలంగాణ యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలు వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన, యువత జీవితం ఎంతో విలువైనదని చెప్పారు. వారి హక్కులు, ఉద్యోగ అవకాశాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆవేదనను గుర్తించి, వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గడ్డం వేణు కుమార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.



