దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతుకలేక అల్లాడిపోతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ మరియు వామపక్షాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట చెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలోని జాతీయ రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. కమ్యూనిస్టు శ్రేణులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
-యుద్ధాల నెపంతో ప్రజలపై దోపిడీ:
ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, ఏపీఎండీసీ జనరల్ సెక్రెటరీ పోకూరి మురళి, డీహెచ్పీఎస్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు దార్ల నాగేశ్వరరావు, కటారి గోపాల్, మోడీ శివయ్యలు పాల్గొని మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ధరలు పెంచబోమని డాంబికాలు పలికిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగియగానే పశ్చిమాసియా యుద్ధాలను నెపంగా చూపిస్తూ పది రోజుల్లోనే నాలుగు సార్లు ఇంధన ధరలను పెంచిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ. 117, డీజిల్ రూ. 105, కమర్షియల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం దారుణమన్నారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. కేంద్రం ధరలు పెంచుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సైతం తన వంతు పన్నులను తగ్గించకుండా ప్రజలపై అదనపు భారం వేస్తోందని విమర్శించారు. కాకినాడ కేజీ బేసిన్ నుండి ఉత్పత్తి అయ్యే గ్యాస్లో కనీసం 50 శాతం వాటాను మన రాష్ట్ర ప్రజలకే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
స్వయం ఉపాధి రంగాలపై చావుదెబ్బ:
ఇది చాలదన్నట్లు వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ. 950 మేర పెంచడం వల్ల చిన్న హోటళ్లు, క్యాంటీన్లు నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న పేద కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి సామాన్యులను కాపాడాలని హితవు పలికారు. లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన రాస్తారోకో కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకులు వెంకటేశ్వరమ్మ, రోజమ్మతో పాటు కన్నయ్య, వెంకట్రెడ్డి, కీర్తి, దినేష్, మణికంఠ, వెంకటేశ్వర్లు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


