తెలంగాణ వ్యాప్తంగా నేడు కాలేజీల బంద్కు పిలుపు
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలతో పాటు జీవో నెం.9 రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (జూన్ 30) తెలంగాణ వ్యాప్తంగా కాలేజీల బంద్కు 18 బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను అత్యవసరంగా విడుదల చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్–9ను తక్షణమే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. జీవో–9 కారణంగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇది తీవ్ర భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎంపీ ఆర్. కృష్ణయ్య సచివాలయంలోని మీడియా పాయింట్లో 18 బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కాలేజీల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాసంఘాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాజేందర్, ఎత్తిరి భీమ్రాజ్, గుజ్జ కృష్ణతో పాటు పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


