బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల ఊబిలోకి ఎమ్మెల్యే జిఎస్ఆర్
వెయ్యి రోజుల పాలన అభివృద్ధి పరుగులు_
_*జయశంకర్ జిల్లా సెప్టెంబర్ 05:జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వెయ్యి రోజుల పాలన విజయోత్సవ ర్యాలీని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ, రోడ్షో చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల ఊబిలోకి వెళ్లిందని ఆరోపించారు. దళిత సీఎం, మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రుణమాఫీ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26.70 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ, పేదలకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిందని గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గానికి రూ.31 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించామని పేర్కొన్నారు. డీబీఎం-38 ద్వారా గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో 44,700 ఎకరాలకు దేవాదుల నీటిని అందించేందుకు రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. గడప సముద్రం, భీమ్గన్పూర్ చెరువులకు సిమెంట్ లైనింగ్ పనులకు మంజూర్లు వచ్చాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు తమ ప్రభుత్వంలో చోటు లేదని, తప్పు చేసే అధికారులు, దళారులు, రౌడీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెయ్యి రోజుల్లో నియోజకవర్గానికి తెచ్చిన నిధులు, గత పాలనలో తెచ్చిన నిధులపై లెక్కలు చూపిస్తామని, భూపాలపల్లిని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు.*_

