హైదరాబాద్, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటనలో నిందితుడికి కఠిన శిక్షగా ఉరి విధించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ను కోరారు.
ఖమ్మానికి చెందిన పేద రజక కుటుంబానికి చెందిన 12 ఏళ్ల బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తన నేరం బయటపడుతుందనే భయంతో అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుంచి బాలికను కిందకు తోసివేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై నిందితుడిపై వేగవంతమైన విచారణ జరిపి ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని కోరుతూ పైడి రాకేష్ రెడ్డి డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి, తెలంగాణ హైకోర్టు ప్రముఖ న్యాయవాది కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు.



