ఖమ్మం ప్రెస్ క్లబ్ పై విచారణకు కలెక్టర్ ఆదేశం
* టీడబ్ల్యూజేఎఫ్ ఫిర్యాదుపై స్పందించిన టి.ఎస్.దివాకర
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
* డీపీఆర్వోతో కలిసి దర్యాప్తు జరుపుతామని టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు డీసీవో గంగాధర్ హామీ
ఖమ్మం :
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రెస్ క్లబ్ వేదికగా సాగుతున్న ఆర్ధిక, అక్రమ వ్యవహారాలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. క్లబ్ నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిధుల దుర్వినియోగం జరుగుతోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ టి.ఎస్.దివాకర స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా సహకార శాఖ అధికారి (డీసీవో)ని ఆదేశించారు.
– టీడబ్ల్యూజేఎఫ్ నేతలతో డీసీవో సమావేశం..
కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీవో గంగాధర్ బుధవారం టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (డీపీఆర్వో) గౌస్ పాషాతో కలిసి ఉమ్మడిగా ఈ అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని జర్నలిస్టు నేతలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
– ఆదాయ, వ్యయాలపై ఆడిటింగ్ జరపాలి : టీడబ్ల్యూజేఎఫ్
గత పదేళ్లుగా ప్రెస్ క్లబ్ను కేవలం రెండు యూనియన్ల నాయకులు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి డీసీవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రెస్ మీట్ల ద్వారా వస్తున్న ఆదాయం, క్లబ్ ఖర్చులు, బిల్లులను బహిర్గతం చేయకుండా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరకు జిల్లా కలెక్టర్కే ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై ఉన్న అధికారాలేంటంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియా) పోస్టులు పెట్టే స్థాయికి తెగబడ్డారని వివరించారు. ప్రెస్ క్లబ్ నిర్వహణ సక్రమంగా సాగాలంటే గత పదేళ్ల ఆర్థిక లావాదేవీలపై ఆడిటింగ్ నిర్వహించడంతో పాటు, యూనియన్ కో రేటుతో ప్రెస్ మీట్ దారులకు రసీదులు ఇవ్వకుండా ఇష్టానుసార వసూళ్లపై విచారణ, నిబంధనల ప్రకారం వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు విజ్ఞప్తి చేశారు.
– టీడబ్ల్యూజేఎఫ్లోకి భారీ చేరికలు
ప్రెస్ క్లబ్ అక్రమాలపై టీడబ్ల్యూజేఎఫ్ సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ యూనియన్ లోకి జర్నలిస్టుల చేరికలు భారీగా పెరిగాయి. సీనియర్ జర్నలిస్టులు టీఎస్ చక్రవర్తి, మందడపు మనోహర్, వేర్పుల నాగేశ్వరరావు, కుర్రా సంపత్ చౌదరి, కుంభం రవికుమార్ ల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలకు చెందిన 40 మందికి పైగా రిపోర్టర్లు బుధవారం ఈ యూనియన్ లో చేరారు. వీరందరికీ యూనియన్ జిల్లా నాయకులు ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, సివిఆర్ శ్రీనివాస్, కొత్త రాకేష్, షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, మధుశ్రీ, దగ్గుపాటి మాధవరావు, ఉపేందర్, కుంభం రవికుమార్, వేర్పుల నాగేశ్వరరావు, సంపత్ చౌదరి, కొరకొప్పుల రాంబాబు, టీఎస్ చక్రవర్తి, హర్షద్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.


