చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అనే నిరసన కార్యక్రమంలో భాగంగా రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోడూరు రైల్వే స్టేషన్ నుంచి వైఎస్సార్ విగ్రహం మీదుగా పార్టీ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్న అనంతరం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రతులు, “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” బాండ్లను ప్రతీకాత్మకంగా చించి దహనం చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలు అమలు కాలేదని, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అలాగే డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


