ఆత్మకూరు, ఆగస్టు 15 (పున్నమి): పట్టణంలో అభిరామ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు చేసి తగిన సలహాలు, సూచనలు అందించారు.
ఎముకలు, కీళ్లు, నరాలు, మోకాళ్ల సమస్యలకు ఆర్థోపెడిక్ వైద్యులు, చిన్నారులకు పీడియాట్రిక్ వైద్యులు, సాధారణ శస్త్రచికిత్సలకు జనరల్ సర్జన్ సేవలు అందించారు. దంత సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు.
డాక్టర్ కె.వి. శ్రావణ్కుమార్, డాక్టర్ మేకపాటి దిప్తీ, డాక్టర్ ఎస్. శివరామ్, డాక్టర్ సుభాష్, దంత వైద్యులు డాక్టర్ నాగిరెడ్డి ప్రవళ్లిక తదితరులు వైద్య సేవలు అందించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు స్థానికంగానే నిపుణులైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ కె.వి. శ్రావణ్కుమార్ తెలిపారు. శిబిరానికి హాజరైన ప్రజలు నిర్వాహకులను అభినందించారు.





