ఆత్మకూరు,జూన్ 28(హరికిరణ్, పున్నమి ప్రతినిధి ):
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మున్సిపల్ పరిధిలోని ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 2,801 మంది ఉండగా, పోలియో బూత్లు, ట్రాన్సిట్ బూత్ల ద్వారా 2,625 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దీంతో 97 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు వైద్యాధికారులు తెలిపారు.మిగిలిన 3 శాతం మంది చిన్నారులకు సోమవారం వైద్య సిబ్బంది ఇంటింటికీ (డోర్ టు డోర్) వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు.పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ బృందం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అంశుదర్ పలు పోలియో బూత్లను సందర్శించి కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఈఓ ఎస్. సుధాకర్, హెచ్పీ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి పాల్గొన్నారు.అదేవిధంగా డాక్టర్ సాయి ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పలు పోలియో కేంద్రాలను సందర్శించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం అభినందనీయమని పేర్కొన్నారు.పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మిగిలిన చిన్నారులకు కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



