9 పేద కుటుంబాలకు రూ.90 వేల ఆర్థిక సహాయం అందజేత
ఆత్మకూరు (కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి తన సేవా భావాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటివరకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధికే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని, ఇప్పుడు ఆత్మకూరు మండలంలోని రూరల్ గ్రామాలకు కూడా విస్తరించి పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా మొత్తం 9 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.90 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఆత్మకూరు మండల పరిధిలోని ఆరవీడు ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి రాములమ్మ (57) కుటుంబానికి, కరటంపాడు ముస్లిం కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ సాహెబ్ (72) కుటుంబానికి, బోయల చిరివెళ్ల గ్రామానికి చెందిన పాడేటి రమణయ్య (74) కుటుంబానికి, మురగళ్ల ఎస్సీ కాలనీకి చెందిన చిచ్చు పెంచల నరసమ్మ (71) కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
అలాగే మున్సిపల్ పరిధిలో మరణించిన 10వ వార్డు చల్లా వీధికి చెందిన కొప్పోలు సుధాకర్ రెడ్డి (45) కుటుంబానికి, కామేపల్లి కొండయ్య (67) కుటుంబానికి, 12వ వార్డు అర్జునవాడికి చెందిన పసుపర్తి కిష్టయ్య (42) కుటుంబానికి, 22వ వార్డు జ్యోతి నగర్కు చెందిన కొప్పాల మహాలక్ష్మమ్మ (60) కుటుంబానికి, 23వ వార్డు టీట్కో కాలనీకి చెందిన దాసరి పెంచలమ్మ (58) కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, కంచి పరమేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు ఆత్మకూరు పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని కొనియాడారు.

