ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి)
ఆత్మకూరులో పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ వాహనదారులకు భారంగా మారుతున్నాయి. నాలుగు రోజుల క్రితం లీటరు పెట్రోల్ ధర ₹110.34 ఉండగా, అనంతరం ₹113.56కు పెంచారు. తాజాగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మరోసారి పెంచి ₹114.58గా నిర్ణయించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే లీటరుకు రూ.4.24 పెరగడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంధన ధరల పెరుగుదలతో ఆటో, బస్సు, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండగా, పెట్రోల్ ధరల పెంపు సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతోందని అంటున్నారు.
ఒక్కసారిగా భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దశలవారీగా ధరలు పెంచుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చిన్నచిన్న పెంపుల పేరుతో వరుసగా ధరలు పెంచడం వల్ల ప్రజలకు తెలియకుండానే అధిక భారం పడుతోందని విమర్శిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలు ప్రారంభమై నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఇంధన ధరలను పెంచడం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. యుద్ధాల కారణం చూపుతూ ధరలు పెంచడం సమంజసం కాదని, ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

