అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 206/2023గా నమోదుైన అత్యాచార కేసు (U/s 376(2)(n), 406, 420 IPC)లో నిందితుడు దాసరి రవితేజ, రేగులంక, పులిగడ్డ గ్రామం, అవనిగడ్డ మండలానికి చెందిన వ్యక్తిపై న్యాయస్థానం నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.
ఎస్.సి. నెం. 174/2025లో విచారణ జరిపిన మచిలీపట్నం 9వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి శ్రీ తోక రాజా వెంకటాద్రి గారు ఈ మేరకు తీర్పు వెలువరించారు.
ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారులు ఎస్ఐ జి. రమేష్ బాబు మరియు సీ ఐ ఎల్. రమేష్ శాస్త్రీయ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి సమగ్ర దర్యాప్తు నిర్వహించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం అవనిగడ్డ సీ ఐ శ్రీ జి. యువకుమార్ పర్యవేక్షణలో, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఎ. నిరంజన్ రావు సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడిపై అభియోగాలు రుజువై శిక్ష ఖరారైంది.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ వి .విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మహిళలపై జరిగే లైంగిక నేరాల విషయంలో జిల్లా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోరని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి, నేరస్థులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. మహిళల భద్రతకు జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారని, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.


