*అడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం… పర్యవేక్షణ లేక ముళ్ల కంప, పొదల మయం*
మే 12 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అబ్బాసు పురం ముచ్చర్ల X రోడ్డు సమీపంలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనం
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “పల్లె ప్రకృతి వనం” ఇప్పుడు అడవిని తలపిస్తోంది. కానీ అది అందమైన అడవి కాదు… నిర్లక్ష్యంతో పెరిగిన ముళ్ల పొదలు, ఎండు చెట్ల అడవి.
ఈ ప్రకృతి వనం లోపల వందలాది మొక్కలు నాటారు. ప్రారంభంలో “పల్లె ప్రకృతి వనం” అనే నీలిరంగు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ వనాన్ని తీర్చిద్దారు.
కానీ ప్రస్తుతం పరిస్థితి విషాదకరంగా ఉంది. వనంలోకి వెళ్లే దారి లేదు. చుట్టూ ఎత్తుగా పెరిగిన గడ్డి, ముళ్ల కంప ఆక్రమించింది. నాటిన మొక్కల్లో కొన్ని ఎండిపోగా, కొన్ని అడవి చెట్ల మధ్య కనిపించకుండా పోయాయి. వనంలోకి వెళ్లే గేటు ఊడిపోయి పక్కన పడి ఉంది. అధికారులు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామంలోని పిల్లలు, పెద్దలు ప్రకృతితో మమేకమయ్యేందుకు, మార్నింగ్ వాక్ చేసుకునేందుకు ఈ వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ వనంలోకి అడుగు పెట్టాలంటేనే భయం. పాములు, తేళ్లు ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు మాట్లాడుతూ, “ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వనం పెట్టింది. కానీ నాటి మొక్కలకు నీళ్లు పెట్టే నాథుడు లేడు. కలుపు తీసేవారు లేరు. కనీసం నెలకు ఒకసారి అయినా పర్యవేక్షిస్తే ఈ వనం గ్రామానికే ఊపిరి అయ్యేది. ఇప్పుడు మాత్రం నిధులు వృధా అయ్యాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయతీ అధికారులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ప్రకృతి వనంలోని పొదలను తొలగించి, మొక్కలకు సంరక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పల్లె ప్రకృతి వనం పేరుకు తగ్గట్టుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు అమలులో పారదర్శకత, నిరంతర పర్యవేక్షణ ఎంత అవసరమో ఈ వనం మరోసారి రుజువు చేస్తోంది.



