_ప్రవక్త మహమ్మద్ బోధనలు మానవతా విలువలకు ప్రతీక_
మంథని, సెప్టెంబర్ 20:
మిలాద్ ఉన్ నబీ పర్వదిన్నాని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎస్ఎల్బీ ఫంక్షన్ హాల్లో సాలేహ మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ యాకుబ్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు పాల్గొని ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్ర, ఆయన బోధనలు, మానవతా విలువలను వివరించారు.
జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమం సందర్భంగా ఫంక్షన్ హాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గం, ఆయన జీవితం ద్వారా సమాజానికి అందించిన సందేశాలను మత పెద్దలు వివరించారు. ప్రేమ, దయ, కరుణ, సహనం, సోదరభావం, పేదల పట్ల ఆదరణ, ఇతరులను గౌరవించడం వంటి మానవతా విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని వారు సూచించారు.
సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని మత పెద్దలు పేర్కొన్నారు. మనుషుల మధ్య భేదాలను పక్కనపెట్టి పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగాలని, కుటుంబం నుంచి సమాజం వరకు మంచి నడవడిక, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలను పాటించాలని సూచించారు. ప్రవక్త మహమ్మద్ జీవితం కేవలం ఒక మతానికి సంబంధించిన అంశంగా కాకుండా మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వక్తలు వివరించారు. ఆయన బోధనల్లోని శాంతి, సహనం, దయ, సేవా భావం వంటి అంశాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువత మంచి మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల మార్గదర్శకంలో నడవడికను పిల్లలు అనుసరిస్తారని, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల దృష్టి ఆవశ్యకం అన్నారు.
విద్యార్థుల్లో ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర, బోధనలు, నైతిక విలువలపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 13 తేదీన పెద్దపల్లి జిల్లా జమియత్ ఉలమా ఆధ్వర్యంలో మంథని పట్టణంలో ‘సీరత్ ఉన్ నబీ టాలెంట్ పరీక్ష’ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మూడు గ్రూపులుగా నిర్వహించిన ఈ పరీక్షలో ప్రతి గ్రూపులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు విలువైన బహుమతులు అందజేశారు. అంతేకాకుండా పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందించారు.
కార్యక్రమానికి హాజరైన మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. జల్సా సీరత్-ఉన్-నబీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సాలేహ మజీద్ కమిటీ సభ్యులు, నిర్వాహకులు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలతో పాటు ముస్లిం సమాజ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో సాలెహ మజీద్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆజం, కమిటీ సభ్యులు నిజాం, అంజద్ పాషా, జనైద్, సోనూ, ఇమామ్ మోజం లతీఫ్, జమియత్ ఉలమా జిల్లా అధ్యక్షుడు లాయ్ ఖుల్లా, ముఖ్తి సాదిక్, మౌలానా జమీల్, మౌలానా ఖయ్యూం, మౌలానా రిజ్వాన్, స్థానిక మైనారిటీ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

